భాగల్పూర్: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం పచ్చి బాలింతను అవస్థలపాలు చేసింది. బిడ్డను కన్న ఆనందం కంటే ఆమె పొత్తికడుపు నొప్పితో నరకయాతన అనుభవించాల్సి ఉంది. కడుపు నొప్పి వస్తుందని మరోసారి ఆస్పత్రికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడంతో అక్కడి వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో కాటన్ బాల్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి దాన్ని తొలగించడంతో బాధితురాలి సమస్య పరిష్కారమైంది. బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భాగల్పూర్ జిల్లాలోని మయాగంజ్కు చెందిన ప్రియాంక కుమారి అనే గర్భిణి ఈ ఏడాది ఫిబ్రవరిలో పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వ దవాఖాన అయిన ‘జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి’లో చేరింది. అక్కడి వైద్యులు ఫిబ్రవరి 19న ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. మగ బిడ్డ జన్మించాడు. ఫిబ్రవరి 26న ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ప్రియాంకకు పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. తగ్గుతుందిలే అనుకుంటే రోజులు గడిచినా కొద్ది నొప్పి మరింత పెరగసాగింది. దాంతో కుటుంబసభ్యులు ఆమెను మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు స్కానింగ్ లాంటి పరీక్షలేవీ చేయకుండానే కుట్లను క్లీన్ చేసి పంపించారు.
అయినా, ప్రియాంకకు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. నొప్పి తీవ్రత రానురాను మరింత ఎక్కువైంది. దాంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన వైద్యులు.. ప్రియాంక కడుపులో కాటన్ బాల్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి ఆ కాటన్ ఉండను తొలగించారు. దాంతో బాధితురాలికి పొత్తికడుపు నొప్పి తగ్గిపోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కేసు నమోదైంది.