Diwali celebrations : సాధారణంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి (Diwali) పండుగ చేసుకుంటారు. ఈ దీపావళి పండుగనే దీపాల పండుగ, దివ్వెల పండుగ అని కూడా అంటారు. మంచిపై చెడు విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించి చీకటిమయమైన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగ నాడు ప్రతి ఇంటి ముంగిట దీపాలు వెలిగిస్తారు. బాణా సంచా కాలుస్తారు. స్వీట్లు పంచుతారు. ఇదిలావుంటే దేశంలోని ఓ ఐదు నగరాల్లో మాత్రం ఈ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య దీపావళి వేడుకలకు ప్రత్యేక కేంద్రంగా మారింది. ఇక్కడ ఏటా దీపోత్సవ్ పేరుతో దీపావళి పండుగ జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రేక్షకులను ఇవి మంత్రముగ్ధులను చేస్తాయి.
వారణాసిలో కూడా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అలరింపజేస్తాయి.
గోవాలో దీపావళిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దీపావళి రాత్రి నరకాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అందుకు ముందుగా భారీ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కోల్కతాలో దీపావళి పండుగ సందర్భంగా కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను ఏర్పాటు చేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటారు.
ముంబైలో కూడా దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలో పటాకుల వెలుగులు కనువిందు చేస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా వేడుకలు జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.