ముంబై, జూలై 30: అత్యాచారం కేసుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్ణయాత్మకమైనవి కాబోవని, కేసును బలపరిచేందుకు మాత్రమే అవి సాయపడుతాయని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 14 ఏండ్ల బాలికపై అత్యాచారం కేసులో నవీ ముంబైకి చెందిన నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ భారతి డాంగ్రే నిరాకరించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. 2020లో నిందితుడు బాలికపై 10 రోజుల పాటు పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా, దవాఖానకు తీసుకెళ్లగా గర్భం దాల్చినట్టు తేలింది. దీంతో ఈ విషయం బయటపడింది. నవీ ముంబైలోని నెరుల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితుడిని 2020 సెప్టెంబర్లో అరెస్టు చేశారు. అతడి ఇంట్లో ఈ బాలిక పనిచేస్తుండేది. అయితే కేసులో డీఎన్ఏ టెస్టు నెగెటివ్గా (బాధితురాలి కడుపులోకి బిడ్డకు నిందితుడు తండ్రి కాదు అని) వచ్చింది. అయితే డీఎన్ఏ పరీక్ష నెగెటివ్గా వచ్చినంత మాత్రాన నిందితుడు అఘాయిత్యానికి పాల్పడలేదని రూఢీపరచలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలిపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు చెప్పడాన్ని కేవలం ఆరోపణలే అని కొట్టేయలేమని తెలిపారు.