చెన్నై: తమిళనాడుకు చెందిన వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డీఎంకే, టీవీకే పార్టీలు ‘ఇండియా’ కూటమిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. (Thirumavalavan) బుధవారం అరియలూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బీజేపీ మతతత్వ రాజకీయాలను అడ్డుకోవడానికి ఒక ఐక్య కూటమి అవసరమని అన్నారు. ప్రాంతీయ సమస్యల కంటే బలమైన బీజేపీ వ్యతిరేక కూటమిని నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘స్థానికంగా టీవీకే, డీఎంకే పరస్పర వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నప్పటికీ, బీజేపీని ఓడించడానికి ఆ రెండు పార్టీలూ ‘ఇండియా’ కూటమిలో భాగం కావాలన్నదే నా జాతీయ స్థాయి దృక్పథం’ అని అన్నారు. పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి రాజకీయ పరిణతి అవసరమని చెప్పారు.
కాగా, ‘ఇండియా’ కూటమిలో ఇటీవల తలెత్తిన ఘర్షణలను తిరుమావళవన్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆ పార్టీ అనుసరించిన వ్యూహాలు తమిళనాడులోని డీఎంకే, పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ మిత్రపక్షాలతో విభేదాలు సృష్టించాయని, అలాగే కేరళలోని వామపక్షాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. మొత్తంగా, స్థానిక రాజకీయ విభేదాల కంటే బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రతిపక్ష ఐక్యతకే ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
మరోవైపు డీఎంకే కూటమితో తమ సంబంధాన్ని అధికారికంగా ముగించలేదని తిరుమావళవన్ తెలిపారు. వీసీకే మాజీ ఎమ్మెల్యే అధికార టీవీకేలో చేరడంపై వస్తున్న సందేహాలకు ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. అయితే తిరుమావళవన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీవీకేకు చెందిన కొందరు నేతలు మద్దతివ్వగా మరికొందరు విమర్శించారు. తిరుమావళవన్కు ‘నోబెల్ బహుమతి’ ఇవ్వాలని ఎండీఎంకే అధినేత వైకో ఎద్దేవా చేశారు.