న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పునరేకీకరణల నేపథ్యంలో ఇండియా కూటమికి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూరం జరగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 8న ఢిల్లీలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి హాజరు కారాదని డీఎంకే నిర్ణయించుకున్నది. దీంతో ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్తో ఆ పార్టీ సంబంధాలు మరింత బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకేను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకొని పోటీచేసిన కాంగ్రెస్ ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు పలికింది. ఈ పరిణామం డీఎంకే నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
కాంగ్రెస్ తమను మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల తమ స్నేహానికి తూట్లు పొడిచిందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్తో బంధాన్ని తెంచుకున్న నేపథ్యంలో పార్లమెంట్లో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుసరించాల్సిన సంయుక్త వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఈ నెల 8న దేశ రాజధానిలో సమావేశం కానున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగనున్న ఈ సమావేశానికి ఇండియా కూటమిలోని 15 పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని రెండు ప్రధాన భాగస్వాములైన తృణమూల్, డీఎంకే పార్టీలు ఓటమి పాలైన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుండటంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.