చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ పోస్టర్ వార్ మొదలుపెట్టింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి వీ సెంథిల్ బాలాజీని మంత్రిమండలి నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను డీఎంకే పార్టీ ప్రశ్నించింది. మనీల్యాండరింగ్ కేసులో బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి తొలుత మంత్రి బాలాజీని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి, డీఎంకే మధ్య వార్ నడుస్తోంది. సీఎంను సంప్రదించకుండా మంత్రిని ఎలా తొలగిస్తారని డీఎంకే ప్రశ్నించింది. గవర్నర్కు రాజ్యాంగ హక్కు లేదని నిలదీశారు. అనేక మంది కేంద్ర మంత్రులపై కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎంకే పోస్టర్లను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లపై కేంద్ర మంత్రుల ఫోటోలను కూడా ప్రచురించింది.
గవర్నర్ రవి తీరుపై సీనియర్ నేతలతో సీఎం స్టాలిన్ ఇవాళ చర్చించారు. న్యాయనిపుణులతోనూ ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ గవర్నర్ రవి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గవర్నర్కు తన హద్దులు తెలియదని ఆ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యను ఆయన తీసుకోవాల్సింది కాదన్నారు. రాజ్యాంగంపై ఆయనకు అవగాహన లేదని, ఆయన బాధ్యతలు ఆయనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మంత్రి సెంథిల్ విషయంపై అటార్నీ జనరల్తో గవర్నర్ రవి సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.