Tamil Nadu Exit Polls : తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) తోపాటు పుదుచ్చేరి (Puduchheri), అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. పశ్చిమబెంగాల్లో రెండు విడతల్లో మిగతా అన్ని చోట్ల ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇవాళ బెంగాల్లో రెండో విడత పోలింగ్ జరిగింది. దాంతో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసనట్లయ్యింది. ఈ క్రమంలో జాతీయ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలను విడుదల చేశాయి. తమిళనాడులో అధికార డీఎంకేనే మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి.
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపడుతుందని మెజారిటీ సర్వే సంస్థల అంచనాలు స్పష్టంచేస్తున్నాయి. అయితే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరిస్తుందని ఎగ్జిట్పోల్స్ అంచనాలు తెలుపుతున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకుగాను డీఎంకే కూటమి 125-145 దక్కించుకుని మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమి 65-80 స్థానాలు గెలుస్తుంది. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే 18-24 స్థానాలు సాధిస్తుంది.
ఇక మ్యాట్రిజ్ సర్వేసంస్థ అంచనా ప్రకారం.. డీఎంకే కూటమి 122-132 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుంది. అన్నాడీఎంకే కూటమి 87-100 స్థానాలు సాధిస్తుంది. టీవీకే పార్టీకి 10-12 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. డీఎంకే కూటమి 145-160 స్థానాలు సాధించి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అన్నాడీఎంకే కూటమి 50-65 స్థానాలు మాత్రమే గెలువనుంది. విజయ్ టీవీకే పార్టీ 13-18 స్థానాలు దక్కించుకోనుంది.
ఇక సీఎన్ఎన్-న్యూస్18 సర్వే ప్రకారం.. ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమికి అధికార డీఎంకే కూటమి కంటే ఎక్కువ శాతం ఓట్లు పోలవనున్నాయి. అన్నాడీఎంకే కూటమికి 39.9 శాతం ఓట్లు రానున్నాయి. డీఎంకే కూటమి 38.9 శాతం ఓట్లు దక్కనున్నాయి. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 15.8 శాతం ఓట్లతో ఫలితాలను ప్రభావితం చేయనుంది.