చెన్నై, ఏప్రిల్ 4: కేంద్ర సర్కార్పైన, సీబీఎస్ఈపైన తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ మాట్లాడే రాష్ర్టాల్లోని విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలను తప్పనిసరిగా నేర్చుకుంటారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. భాషల గురించి రాష్ర్టాలకు కేంద్రం నీతులు చెప్పడం ద్వంద్వ నీతికి పరాకాష్ఠగా ఆయన ఎద్దేవా చేశారు. త్రిభాషా విధానం వల్ల హిందీ మాట్లాడే విద్యార్థులకే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనం చేకూరుతున్నదని, రాష్ర్టాల మధ్య అసమానతలు పెరుగుతాయని స్టాలిన్ హెచ్చరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు అందించాల్సిన ఈ తరుణంలో వారిపై అదనపు భాషా భారాన్ని మోపటం సరికాదని అన్నారు.
రాష్ర్టాల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవటం సమాఖ్య స్ఫూర్తికి, కోట్ల మంది భాషా గుర్తింపునకు జరిగిన అవమానమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలుజేయాలన్న ప్రతిపాదనపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, దేశంలో భాషా వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నమని మండిపడ్డారు. ఇది సాధారణ విద్యా సంస్కరణ కాదని, భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నామనే ముసుగులో హిందీని రుద్దేందుకు జరుగుతున్న ఆందోళనకర ప్రయత్నమిదని విమర్శించారు
. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషలను పక్కనపెట్టి హిందీకి అగ్రస్థానం కల్పిస్తున్నదని ఆరోపించారు. భాషా విధానం పేరుతో హిందీయేతర రాష్ర్టాల్లో హిందీని విస్తరించాలని చూస్తున్నారని, దక్షిణాది విద్యార్థులకు ఇది బలవంతంగా హిందీని నేర్పడమే తప్ప మరొకటి కాదని అన్నారు.