చెన్నై : కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్న డీఎంకే ఎంపీ కనిమొళి మంగళవారం పీపీఈ కిట్ ధరించి చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా రోగులు పలువురు పీపీఈ కిట్స్తో పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కనిమొళి తాను చికిత్స పొందుతున్న దవాఖాన నుంచి అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఏప్రిల్ 3న కనిమొళికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. పోలింగ్ చివరి గంటలో సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కొవిడ్-19 సోకిన ఓటర్లు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.