చెన్నై : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ మతతత్వ వైఖరిపై డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ కేంద్రంలో కొలువుతీరినప్పటి నుంచి ప్రజల్లో విభజన చిచ్చు రేపుతున్నదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి పొందేందుకు కాషాయ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు. విభజిత, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు.
ఇక కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ మత రాజకీయాలే లక్ష్యంగా మోదీ సర్కార్పై విరుచుకుపడింది. కాషాయ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతున్నదని రాజస్ధాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ (Ashok Gehlot) అంతకుముందు మండిపడ్డారు. కాషాయ నేతలు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో తలమునకలైనప్పుడు మణిపూర్ అల్లర్లలో వంద మంది మరణించారని అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ను సందర్శించిన అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయని గెహ్లోట్ గుర్తుచేశారు. మణిపూర్ మండుతున్నా ఆ విషయాన్ని కేంద్రం సీరియస్గా తీసుకోవడంలో విఫలమవుతున్నదని అన్నారు. మతం పేరిట బీజేపీ రాజకీయాలు నడుపుతున్నదని ప్రజలు అర్ధం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Read More :