చెన్నై, జూన్ 4: తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే తేలిపోయాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందగా.. ఎండీఎంకే, ఐయూఎంఎల్ ఒక్కోచోట విజయం సాధించాయి. కాగా, ఏఐఏడీఎంకే ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలను పొందాలనుకున్న ఆ పార్టీ ఆశలు ఫలించలేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ హేమాహేమీలు ప్రచారం చేసినప్పటికీ కమలం పార్టీ గతి మారలేదు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓడిపోయారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ తరఫున చెన్నై సౌత్ స్థానంలో బరిలోకి దిగిన తమిళి సై.. డీఎంకే అభ్యర్థి టి.సుమతి చేతిలో ఘొరంగా ఓడిపోయారు. 10కి పైగా ఓటింగ్ శాతాన్ని పొందడమే కమలం పార్టీకి కాస్త ఊరట కలిగించే అంశం.
ఇండియా 39
ఎన్డీయే 0