చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధికార డీఎంకే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు.
కాగా, నీట్ పరీక్ష రాసి అర్హత సాధించని సుమారు 22 మంది తమిళ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం నీట్కు వ్యతిరేకంగా గళమెత్తింది. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఇది ఉందని విమర్శించింది. పట్టణ విద్యార్థులు, కోచింగ్ సెంటర్లకు అనుకూలంగా ఉన్న నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే తమిళనాడుకు నీట్ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును రాష్ట్రపతికి పంపింది. ఈ బిల్లు ఆమోదం కోసం డీఎంకే ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.