DMK Files | తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై బీజేపీ పార్టీ ‘డీఎంకే ఫైల్స్’ పేరిట అవినీతి ఆరోపణలు చేసింది. ఈ అడ్డగోలు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే.. కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి రూ.500 చెల్లించాలంటూ నోటీసులు పంపింది. డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఆర్ఎస్ భారతి నోటీసులు జారీ చేశారు. ‘డీఎంకే’ ఫైల్స్ పేరుతో ముఖ్యమంత్రి సాల్టిన్తో సహా ఇతర పార్టీ నేతలపై అన్నామలై అవినీతి ఆరోపణలు చేశారు. అన్ని తప్పుడు ఆరోపణలు చేశారని, నిరాధారమైనవి, పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ నోటీసుల్లో పేర్కొంది.
అన్నామలై క్షమాపణలు చెప్పాలని, రూ.500కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారని, పార్టీ అధ్యక్షుడికున్న మంచి పేరు, ప్రతిష్టకు ఆరోపణలు చేసినందుకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. పార్టీ అధ్యక్షుడి ప్రతిష్టకు రూ.200కోట్లు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ.300కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అన్నామలై చేసిన రూ.200కోట్ల అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ.. డీఎంకే అధ్యక్షుడు తన 56 సంవత్సరాల ప్రజా జీవితంలో ఏ వ్యక్తి నుంచి పైసా తీసుకోలేదని పేర్కొంది.
వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రూ.500కోట్ల పరిహారాన్ని సైతం చెల్లించాలని, వాటిని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు నోటీసుల్లో తెలిపింది. నోటీసు అందిన 48 గంటల్లో క్షమాపణలు చెప్పడంతో పాటు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందులో విఫలమైతే సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ను ప్రారంభించాల్సి ఉంటుందని.. ఆ తర్వాత ఎదురయ్యే పర్యావసనాలకు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. అన్నామలై తమిళనాడు ఎన్నికల్లో రాణించకపోవడంతో.. డీఎంకే నేతతో పాటు నాయకుల ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడని డీఎంకే విమర్శించింది.