చెన్నై : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అన్నామలై ధరించే బెల్ అండ్ రాస్ లిమిటెడ్ ఎడిషన్ రఫేల్ వాచ్పై సెంథిల్ పలు ప్రశ్నలు గుప్పించారు. రఫేల్ వాచ్ కోసం కేవలం 500 పీస్లు తయారుచేశారని, దీని ధర రూ. 5 లక్షలు కాగా తనకు నాలుగు మేకలు మాత్రమే ఉన్నాయని చెప్పుకునే అన్నామలై ఇంతటి ఖరీదైన వాచ్ను ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు.
ఈ వాచ్ కొనుగోలుకు సంబంధించి రసీదును అన్నామలై చూపగలరా అని నిలదీశారు. దసాల్ యుద్ధ విమానాల తయారీని సెలబ్రేట్ చేసుకునేందుకు కంపెనీ తయారు చేసిన బెల్ అండ్ రాస్ రఫేల్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ను అన్నామలై ధరించడంతో ఈ వివాదానికి బీజం పడింది. డీఎంకే మంత్రి ఆరోపణలపై అన్నామలై స్పందిస్తూ ఇది కలెక్టర్స్ ఎడిషన్ అని ఈ వాచ్ తాను తుదిశ్వాస విడిచేవరకూ తనతో ఉంటుందని చెప్పారు.
ఈ వాచ్ను భారతీయలు కాకుండా మరెవరు కొనుగోలు చేస్తారని అన్నారు. దసాల్ట్ రూపొందించిన రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ పరికరాలను ఉపయోగించి ఈ వాచ్ను తయారుచేశారని చెప్పారు. రఫేల్ మన అమ్ములపొదిలో చేరిన తర్వాతే యుద్ధ నిబంధనలు మారిపోయాయని, మన సామర్ధ్యం మెరుగుపడిందని అన్నారు. కంపెనీ తయారుచేసిన 500 వాచ్ల్లో తాను 149వ పీస్ను ధరిస్తున్నానని అన్నామలై పేర్కొన్నారు.