న్యూఢిల్లీ, మార్చి 16: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్.. రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. గురుగ్రామ్లోని సెక్టార్ 63లోగల ఓ లగ్జరీ ప్రాజెక్టులో ఫ్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడైపోయాయి మరి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.8,000 కోట్లకుపైగా సేల్స్ జరిగాయి. ఇక్కడి గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ మినీ మార్కెట్ దగ్గర్లోని డీఎల్ఎఫ్ 63 వద్ద ‘ది ఆర్బర్’ పేరిట కొత్త ప్రాజెక్టు వస్తున్నది. ఈ క్రమంలోనే ప్రీ-లాంచ్ సేల్స్కు డీఎల్ఎఫ్ తెరతీసింది. దీంతో 1,137 లగ్జరీ ఫ్లాట్లను ఎగబడిమరీ కొనేశారు. ఒక్కో ఫ్లాట్ ప్రారంభ ధర రూ.7 కోట్లుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ కొనుగోలుదారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ప్రాజెక్టులోని అన్ని ఫ్లాట్లూ అమ్ముడయ్యాయంటూ డీఎల్ఎఫ్ చెప్పేసింది కూడా. కాగా, సకల సౌకర్యాలతో అత్యంత ఆధునిక, సాంకేతిక హంగులతో ఈ లగ్జరీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. 25 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వస్తున్న ఈ ప్రాజెక్టులోని ఒక్కో ఫ్లాట్.. 4బీహెచ్కే, స్టడీ, యుటిలిటీ రూం లేఅవుట్లతో ఉంటుంది. అందుకే వీటి కోసం దేశ, విదేశీ కస్టమర్లు పోటీపడ్డారని సంస్థ చెప్తున్నది. ఈ ప్రాజెక్టులో 38/39 అంతస్తులతో 5 ఐకానిక్ టవర్లను డీఎల్ఎఫ్ నిర్మిస్తున్నది.