న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం తగదని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar )ఆక్షేపించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని అన్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ ప్రధాని దేవె గౌడ నిర్ణయాన్ని డీకే తప్పుపట్టారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ను జేడీ(ఎస్) బహిష్కరించిన విషయం ఆ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి మరువరాదని డీకే శివకుమార్ గుర్తుచేశారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని, ప్రధాని మోదీ ప్రారంభించడం సరైంది కాదని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటామని ఇప్పటికే పలు పార్టీలు స్పష్టం చేశాయి.
కాగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని జేడీ(ఎస్) నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టడంపై కుమారస్వామి మండిపడ్డారు. తాము కాంగ్రెస్ పార్టీకి బానిసలం కాదని, తాము సొంతంగా నిర్ణయం తీసుకుంటామని, తాము కాంగ్రెస్ను ఎందుకు అనుసరించాలని ప్రశ్నించారు. ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనుండగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని 21 పార్టీలు తేల్చిచెప్పాయి.
Read More