DK Shivakumar : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేశామని రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తున్నామని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఆయన ఆదివారం బెంగళూర్లో జనస్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నాటక ప్రజలు నిలకడైన తీర్పు వెల్లడిస్తారని, అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు వారు ఇంకా మెరుగైన రీతిలో ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. తాము అన్ని ఎన్నికల గ్యారంటీలను అమలు చేశామని, తాము ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలుపుకున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానమంత్రి అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎన్నికల ఫలితాలు రానివ్వండి ఏమవుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.
కర్నాటకలో ఈసారి తాము మెరుగైన సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము హామీ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేశామని కర్నాటకలో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య శనివారం ఆరోపించారు. తమ ప్రభుత్వం దేశానికి కర్నాటక తరహా ప్రభుత్వ అభివృద్ధి మోడల్ను అందించిందని అన్నారు.
Read More :