బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని గుర్తుచేశారు. ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించడంతో పాటు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెల్లడి కానున్న నేపధ్యంలో ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ పలు వివరాలు వెల్లడించారు. జేడీఎస్తో తమ పార్టీ సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు. త్రిముఖ పోరులో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తాము కష్టపడి పనిచేశామని, అది ఇప్పుడు ఫలితాలు ఇస్తుందని అన్నారు.
ఇక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్ధితి ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ ఎమ్మెల్యేలకు ప్రత్యర్ధి పార్టీలు ప్రలోభాల వల విసురుతాయని, అప్రమత్తంగా ఉండాలని డీకే సూచించారు. ఆపరేషన్ లోటస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్టీ అభ్యర్ధులను కోరారు. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More