న్యూఢిల్లీ: పండుగ ఏదైనా దేశంలో సేల్స్ భారీ స్థాయిలో ఉంటాయి. జనం పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తుంటారు. ఇక అది దీపావళి పండుగ అయితే వేరేగా చెప్పనక్కర్లేదు. సేల్స్ జోష్లో ఉంటాయి. ఈ దీపావళి పండుగకు కూడా జనం కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఈ దీపావళికి ఏకంగా రూ.3.75 లక్షల కోట్ల సేల్స్ జరిగాయి. ఇందులో పటాకుల ఖర్చులు కూడా ఉన్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. పటాకుల ఖర్చులు కాకుండానే ఈ దీపావళి పండుగకు ఇంత భారీ స్థాయిలో సేల్స్ జరిగాయి.
ఈ ఏడాది దీపావళి ఖర్చులకు సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జాతీయ అధ్యక్షుడు, బీసీ భారతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది దీపావళికి దాదాపు రూ.3.75 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఈ దీపావళి షాపింగ్తో దేశవ్యాప్తంగా మార్కెట్ల రికార్డులు బద్ధలయ్యాయి.
మొత్తం రూ.3.75 లక్షల కోట్ల దీపావళి సేల్స్లో జనం 13% ఆహారం, కిరాణం కోసం, 9% ఆభరణాల కోసం, 12% వస్త్రాల కోసం, 4% డ్రై ఫ్రూట్స్ కోసం, 4% స్వీట్ల కోసం ఖర్చుపెట్టారని ప్రవీణ్ ఖండేల్వాల్ తన రిపోర్టులో తెలిపారు. అదేవిధంగా స్నాక్స్, గృహోపకరణాలు 3%, సౌందర్య సాధనాల కోసం 6%, ఎలక్ట్రానిక్స్ & మొబైల్స్ కోసం 8%, పూజ సామాగ్రి కోసం 3%, కిచెన్వేర్ కోసం 3%, బేకరీ ప్రోడక్ట్స్ కోసం 2%, గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం 8%, ఫర్నీచర్ కోసం 4% ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. మిగిలిన 20% ఆటోమొబైల్స్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులపై ఖర్చు చేశారు.