PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): జీ20 సమావేశాల నేపథ్యంలో.. విదేశీ మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ విదేశీ పర్యటనలో చీమ చిటుక్కుమన్నా.. అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. కానీ జీ20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ తన నివాసంలో ప్రత్యేకంగా గంటకు పైగా బైడెన్తో సమావేశమైనా.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి నిర్వహంచడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ అంతర్జాతీయ విలేకరులకు తనను ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అంతేకాదు అమెరికా జర్నలిస్టులకు కూడా బైడెన్తో మాట్లాడించటంలో కూడా భారత్ అడ్డుపుల్ల వేసింది. అమెరికా మీడియా, వైట్ హౌస్ ప్రెస్ కార్ప్స్ సభ్యులకు బైడెన్ను ప్రశ్నించే అవకాశం లేదన్న సమాచారంతో వారు ఆశ్చర్యపోయారు. ద్వైపాక్షిక చర్చల వివరాలు ప్రెస్నోట్ జారీ చేయడం వారిని నిరాశకు గురి చేసింది. అయితే తిరుగు ప్రయాణంలో వియత్నాంలో బైడెన్ మీడియాతో మాట్లాడతారని వైట్హౌస్ అధికారులు ప్రకటించారు.
భారత మీడియాకు కొత్తేంకాదు…
ఢిల్లీలో బైడెన్ అమెరికా మీడియాతో మాట్లాడితే.. ఆతిథ్య దేశ ప్రధానిగా మోదీ కూడా ఆయనతో కలిసి పాల్గొనాల్సి వస్తుంది. చైనా దురాక్రమణ, మణిపుర్ హింసాకాండ, హర్యానాలో మత ఘర్షణలు, పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, అదానీ ఉదంతం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల కష్టాలు లాంటి క్లిష్ట సమస్యలపై మీడియా కురిపించే ప్రశ్నల వర్షాన్ని మోదీ ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖికి ఆస్కారం ఇవ్వట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా గత తొమ్మిదేండ్లలో ఏనాడు దేశీయ మీడియా ముందుకే రాని ప్రధాని మోదీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడతారనుకోవడం అత్యాశే అవుతుందని ఓ వెబ్సైట్ వ్యాఖ్యానించింది. భారతీయ మీడియాకు మాత్రం ఇదేం కొత్త కాదని, ఎలాంటి నిరాశ పర్చలేదని ఆ వెబ్సైట్ వ్యాఖ్యానించింది.
అమెరికా అధికారుల నిస్సహాయత…
బైడెన్తో మాట్లాడే అవకాశం కల్పించేలా అమెరికా మీడియా, వైట్హౌస్ ప్రెస్ కార్ప్స్లు ఒత్తిడి చేసినా వైట్హౌస్ ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడి కార్యకలాపాలను కవర్ చేయడం మీకు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. మా వంతు కృషి చేస్తాం. జీ20 సమావేశాల నిర్వాహకులైన భారత ప్రభుత్వంతో సమన్వయం, సంప్రదింపుల ద్వారా పనిచేయాల్సి ఉంటుంది’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ చెప్పినట్టు ఆ వెబ్సైట్ పేర్కొంది.