శివసేనలో తిరుగుబాటు రేగిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రెండుసార్లు అనుకున్నారని, కూటమిలోని సీనియర్ నేత ఒకరు ఆపారని విశ్వసనీయ వర్గాలు సోమవారం పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 27: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీచేసిన అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టు సోమవారం తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఊరట కల్పించింది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు జూలై 11 వరకు సమయం ఇచ్చిన న్యాయస్థానం.. అనర్హతకు సంబంధించి అప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అనర్హత నోటీసుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ రెబల్స్ వేసిన పిటిషన్పై డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అసెంబ్లీలో ప్రస్తుతం ఎటువంటి బలపరీక్ష ఉండకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెబల్ క్యాంప్ ఫ్లోర్ టెస్టు డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. శివసేనపై తిరుగుబాటు చేసిన 39 మంది ఎమ్మెల్మేల ప్రాణాలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రెబల్ మంత్రుల శాఖలు తొలగింపు
గువాహటి రెబల్స్ క్యాంపులోని తొమ్మిది మంది మంత్రుల శాఖలను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. పాలనా సౌలభ్యం కోసం ఆయా శాఖను ఇతర మంత్రులకు అప్పగించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. కాగా, ప్రభుత్వానికి శివసేన లెజిస్లేచర్ పార్టీకి చెందిన 38 మంది సభ్యులు మద్దతు ఉపసంహరించుకున్నారని, ఎంవీఏ కూటమి మెజార్టీ కోల్పోయిందని ఏక్నాథ్ షిండే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
చంపినా రెబల్స్ మార్గాన్ని తీసుకోను: రౌత్
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు జారీచేసింది. ముంబైలోని చాల్ పునారాభివృద్ధి ప్రాజెక్టు, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులపై రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఓ కుట్రగా అభివర్ణించారు. ‘నన్ను చంపినా రెబల్స్ మాదిరిగా గువాహటి మార్గాన్ని అశ్రయించబోను’ అని స్పష్టం చేశారు. ఈడీ విచారణకు హాజరుకాబోనని తెలిపారు.
ఏక్నాథ్కు డిప్యూటీ సీఎం?
శివసేనలో తిరుగుబాటు వెనుక బీజేపీ ఉన్నదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు తగినట్టుగానే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. గవర్నర్ బలపరీక్షకు ఆదేశించి, అందులో ఎంవీఏ ప్రభుత్వం కూలిపోతే రెబల్స్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నది. ఇందుకోసం ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు.