Shiv Sena | ముంబై, జనవరి 10: మహారాష్ట్రలో గత రెండేండ్లుగా కొనసాగుతున్న ‘శివసేన వర్సెస్ శివసేన’ రాజకీయ ప్రతిష్ఠంభనపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి షాక్ ఇస్తూ.. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని బుధవారం ప్రకటించారు. 2022, జూన్లో శివసేనలో రెండు వర్గాలు ఏర్పడిన సమయంలో పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు 37 మంది షిండే వర్గంలోనే ఉన్నారని స్పీకర్ పేర్కొన్నారు. 2024, జనవరి 10లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నర్వేకర్ తన నిర్ణయాన్ని డెడ్లైన్ చివరి రోజున వెల్లడించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం ఒకరిపై ఒకరు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించిన ఆయన.. శివసేన ప్రముఖ్కు(అధ్యక్షుడు) పార్టీ నుంచి ఎవరినీ తొలగించే అవకాశం లేదని, ఎన్నికల కమిషన్కు 1999లో శివసేన సమర్పించిన ఆ పార్టీ రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.
2018లో సవరించిన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఠాక్రే వర్గం వాదనను స్పీకర్ తిరస్కరించారు. 1999 పార్టీ రాజ్యాంగం రాష్ట్రీయ కార్యకారిణి(నేషనల్ ఎగ్జిక్యూటివ్)ను సుప్రీంగా పేర్కొన్నదని తెలిపారు. శివసేన(యూబీటీ) నేత సునీల్ ప్రభు విప్ పదవి 2022, జూన్ 21 నుంచి పోయినట్టేనని, అప్పటి నుంచి షిండే గ్రూపునకు చెందిన భరత్ గొగావాలే అధికారిక విప్గా అయ్యారని స్పీకర్ నర్వేకర్ తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం షిండేతో సహా ఆయన వర్గం 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం పిటిషన్ వేసింది.
స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో సీఎం షిండే మద్దతుదారులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకొన్నారు. మరోవైపు స్పీకర్ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రజాస్వామ్య హత్య అని, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, స్పీకర్పై కోర్టు ఉల్లంఘన పిటిషన్ వేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే తీర్పునివ్వాలని న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. పార్టీ విప్గా సునీల్ ప్రభు, గ్రూప్ నేతగా అజయ్ చౌదరి అధికారాన్ని కోర్టు ఆమోదించిందని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నర్వేకర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు అంశం అసలు విషయమని, అయితే రెండు వర్గాలకు చెందిన ఏ ఎమ్మెల్యేను కూడా స్పీకర్ అనర్హుడిగా ప్రకటించకపోవడంపై ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్పీకర్ ఆర్డర్ను కుట్రగా శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అభివర్ణించారు. ఇది మరాఠాలకు బ్లాక్ డే అని పేర్కొన్నారు. ‘ఢిల్లీ’దయతో నర్వేకర్ స్పీకర్ అయ్యారని, అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ను ఆయన పాటిస్తున్నారని, దీన్ని తాము ఆమోదించమని అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రేకు చెందిన శివసేనను అంతం చేయడం బీజేపీ కల అని, అయితే అది సాధ్యం కాదని పేర్కొన్నారు. బాలాసాహెబ్ శివసేనను దొంగలకు అప్పగించే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సంబురాలు చేసుకొంటున్న నేతల ముగింపు ఇటలీ నియంత ముస్సోలిని లాగే ఉంటుందని, ప్రజలు వారిని క్షమించబోరని రౌత్ అన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ స్పందిస్తూ ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర సానుభూతి ఉంటుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న పోరాటమన్నారు.
స్పీకర్ నిర్ణయంపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ప్రజాస్వామ్యంలో ‘నంబర్లు’ ముఖ్యమని అన్నారు. తన నేతృత్వంలోని శివసేనకు ఉద్ధవ్ వర్గం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ చీఫ్ వ్యక్తిగత అభిప్రాయం మొత్తం పార్టీ అభిప్రాయం కాబోదని చెప్పారు. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తమకు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.