స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకాన్ని (ఎంపీ ల్యాడ్స్) కేంద్రం నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం కింద కేటాయించిన నిధులు ఇందుకు అద్దం పడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒకలా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు మరోలా నిధులు మంజూరు చేస్తుండటంతో కేంద్రం వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 2022-23లో ఎంపీ ల్యాడ్స్ కింద కేంద్రం రూ.3,857 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ.767 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
ఇందులోనూ తెలంగాణ పట్ల ఎప్పటిలానే వివక్ష చూపింది. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు రూ.110 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఇది జాతీయ సగటు 19.8 శాతం కంటే తక్కువే. బీజేపీ పాలిత రాష్ర్టాల ఎంపీలకే కేంద్రం సింహభాగం నిధులను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్కు రూ.127.5 కోట్లు, కర్ణాటకకు రూ.37.5 కోట్లు, కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సఖ్యతగా ఉండే ఒడిశాకు రూ.60 కోట్లు విడుదల చేసింది. గత ఏడాది బీహార్లో జనతాదళ్(యూ) బీజేపీతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ రాష్ర్టానికి కూడా రూ.70 కోట్లు విడుదల చేసింది.
గతంలో నిష్పాక్షికంగా..
1999లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తారు. గతంలో ఈ పథకానికి ఎలాంటి బేధ భావాలు లేకుండా అమలు చేశారు. కరోనా కాలంలో 2021 నవంబర్ నుంచి రెండేండ్లు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఎంపీ ల్యాడ్స్ పథకం మార్గదర్శకాలు-2016 ప్రకారం ఒక ఏడాది నిధులు ఖర్చు చేయకపోతే మరుసటి సంవత్సరానికి వడ్డీతో సహా బదిలీ అయ్యేవి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వడ్డీని కేంద్ర సమీకృత నిధికి బదిలీ చేస్తూ మార్గదర్శకాలు మార్చింది.