హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రం అమలు చేస్తుందన్నారు. ఈ నెల 1 నాటికి 2.97కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించామని, రాష్ట్రంలో మొత్తం 6,82,215 మందికి కరోనా పాజిటివ్గా తేలిందన్నారు.
పాజిటివిటీ రేటు 2.29శాతం, మరణాల రేటు 0.5శాతంగా ఉందని పేర్కొన్నారు. 34 ప్రభుత్వ, 76 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్, 1231 రాపిడ్ పరీక్షా కేంద్రాలున్నాయని, గత నెలలో రోజుకు సుమారు 35,129 పరీక్షలు నిర్వహించినట్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందని.. టీకా మొదటి డోసు 100శాతం, రెండో డోసు 69శాతం పూర్తయిందని కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.