న్యూఢిల్లీ : కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆరోపించారు. రామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రాజస్దాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగిన నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా దిగ్విజయ్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ దుమారం రేగింది. ఏప్రిల్ 10న ఖర్గోనేలో మత ఘర్షణలు జరిగిన సమయంలో తీసిన ఫోటో అంటూ ఆయన మసీదుపై కొందరు యువకులు కాషాయ జెండాను ఎగురవేస్తున్న ఇమేజ్ను ట్వీట్ చేశారు. అయితే ఇది బిహార్కు సంబంధించిన పాత ఫోటో అని దిగ్విజయ్ సింగ్ షేర్ చేసిన పోస్ట్ నకిలీదని వెల్లడైంది. ఇక కాషాయ పార్టీని టార్గెట్ చేస్తూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.