న్యూఢిల్లీ : ఓబీసీ కోటా వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గించడం సిగ్గుచేటని అన్నారు. మధ్యప్రదేశ్ స్ధానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సర్వోన్నత న్యాయస్ధానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం తీర్పును సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వాగతించడాన్ని దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులపై సీఎం సంతోషం వ్యక్తం చేస్తున్నారని ముందుగా ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గినందుకు ఆయన సిగ్గుపడాలని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెబుతోందని, ఇతర తరగతుల వారికి 16 శాతం, 20 శాతం రిజర్వేషన్ తగ్గించలేమని అంటోదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దీంతో మిగిలిన 14 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు వర్తిస్తాయని ఇది గతంలో 27 శాతంగా ఉండేదని అన్నారు.
దీని ప్రకారం పంచాయితీల్లో ఓబీసీలకు దక్కే పదవులు సగం తగ్గిపోతాయని సింగ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని చెప్పారు. బీసీల పట్ల బీజేపీ దృక్పదం సరిగ్గా లేదని విమర్శించారు. ఎన్నికలు జరిగితే పంచాయితీలు, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి దోపిడీ చేయడం కుదరదని కాషాయ నేతలు రాజ్యాంగ నిబంధనలను పాటించడం లేదని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.