న్యూఢిల్లీ, మే 23: రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ మొదలైన మొదటి రోజే న్యూఢిల్లీలో చాలాచోట్ల గందరగోళం నెలకొంది. మంగళవారం చాలామంది ప్రజలు బ్యాంకులకు వెళ్లడంతో భారీ క్యూ లైన్లు కనిపించాయి. దీని వల్ల ఎండా కాలంలో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని బ్యాంకులు నోట్లను మార్చుకోవడానికి బదులు డిపాజిట్ చేయాలని కోరడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా తమ గుర్తింపు కార్డులు, పాన్, ఆధార్ వివరాలు అడిగాయని ప్రజలు ఫిర్యాదులు చేశారు.
లజ్పత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలో నోట్ల మార్పిడిపై బ్యాంకు సిబ్బందికి, ప్రజలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ బ్యాంకు ఖాతాదారులు కానివారిని మాత్రమే ఐడీ ప్రూఫ్ అడిగామని కొన్ని బ్యాంకులు తెలిపాయి. మరోవైపు పోస్టాఫీసుల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి వీలు లేదని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లూ కనిపించని రూ.2 వేల నోట్లు ఒక్కసారి మార్కెట్లోకి వస్తున్నాయని హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారి వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడం లేదని వాహనదారులు ఫిర్యాదు చేశారు.