న్యూఢిల్లీ: ఒకప్పుడు అమెరికా చదవులు.. అక్కడి ఖర్చులు స్థోమతను మించిపోవటంతో విద్యార్థులు కెనడా, బ్రిటన్వైపు మళ్లారు. ఇప్పుడు ఆ దేశాల్లోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్లో భారత విద్యార్థులను ఆర్థిక కష్టాలు వెక్కిరిస్తున్నాయి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటమే ఇందుకు కారణం. దీంతో విద్య కోసం బ్రిటన్కు వెళ్లిన భారత విద్యార్థులకు అక్కడి నగరాల్లో వసతిని వెతుక్కోవడం, జీవన వ్యయాన్ని తట్టుకోవడం పెను సవాలుగా మారింది. బ్రిటన్లో నిరుడు సెప్టెంబర్ వరకు 12 నెలల కాలంలో వినిమయ ధరల సూచీ 8.8 శాతం మేరకు పెరిగింది. ద్రవ్యోల్బణం ఏకంగా 9.3 శాతానికి ఎగసినట్టు నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని ఫలితంగా అక్కడ ఆహార ద్రవ్యోల్బణం, ఇండ్ల అద్దెలు, రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో భారత విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
లండన్లోని గోల్డ్స్మిత్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ విద్యనభ్యసించేందుకు 3 నెలల క్రితం బ్రిటన్కు వెళ్లిన ఓ వ్యక్తి వసతి దొరక్క, గత అక్టోబర్ 1 -21 మధ్య తాత్కాలిక వసతి కోసమే దాదాపు రూ.లక్ష ఖర్చు చేయాల్సి వచ్చింది. ‘ప్రస్తుతం బ్రిటన్లో రేట్లు గణనీయంగా పెరగడంతో అత్యవసరాలకు, ఆకలిని తీర్చుకునేందుకు మాత్రమే డబ్బును వెచ్చించేందుకు ప్రయత్నిస్తున్నా. ఇంటికి దూరంగా పరాయి దేశంలో ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా బ్రిటన్ లాంటి దేశాల్లో వైద్యానికి భారీగా సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది’ అని మరో విద్యార్థి పేర్కొన్నారు.