న్యూఢిల్లీ: యాస్ తుఫాన్పై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి బెంగాల్ మాజీ సీఎస్ ఆలాపన్ బంధ్యోపాధ్యాయ డుమ్ము కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు మాజీ సీఎస్ స్పందించారు. యాస్ తుఫాన్పై ప్రధానితో జరిగిన సమీక్ష సమావేశాన్ని తానేమీ కావాలని దూరం పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నంత సేపు తాను అక్కడే ఉన్నట్లు ఆయన తెలిపారు. సీఎం మమతా బెనర్జీ ఆదేశాల ప్రకారం యాస్ తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు దిఘా పట్టణానికి వెళ్లినట్లు తన లేఖలో పేర్కొన్నారు.
మోదీతో భేటీకి హాజరుకాలేకపోయిన బంధ్యోపాధ్యాయను కేంద్రం రికాల్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన రిటైర్ అవుతున్నట్లు సీఎం మమతా ప్రకటించారు. సీఎస్ను రిలీజ్ చేయడానికి నిరాకరించిన ఆమె.. తనకు సలహాదారుడిగా పనిచేయనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఉన్నందు వల్లే ఆ భేటీకి దీదీ హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. కానీ ప్రధాని పర్మిషన్తోనే తాను మరో మీటింగ్కు వెళ్లినట్లు మమతా తెలిపారు.
సమావేశానికి వచ్చిన ప్రధానిని 15 నిమిషాల పాటు నిరీక్షించేలా చేశారని, అందుకే బంధ్యోపాధ్యయకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొన్నది. సమీక్ష సమావేశానికి హాజరు అవుతారా అని మరో అధికారి సీఎస్ బంధ్యోపాధ్యాయకు ఫోన్ చేస్తే అప్పుడు ఆయనతో పాటు సీఎం మమతా వచ్చి ప్రధానిని కలిసి వెళ్లినట్లు కేంద్రం ఆరోపించింది. రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు ఐఏఎస్ ఆఫీసర్ విస్మరించాలని కేంద్రం పేర్కొన్నది.