Rahul gandhi | హిందు, హిందుత్వ… ఈ రెండు పదాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరివిగా వాడుతున్నారు. దీంతో దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. సహజంగా ఈ రెండు పదాలను బీజేపీ విరివిగా వాడేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ రెండు పదాలను పదే పదే వాడుతూ, బీజేపీకి కౌంటర్ ఇస్తోంది. అయితే 12 రోజుల్లో రాహుల్ ఈ పదాలను 112 సార్లు ఉచ్చరించారని ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. మొట్ట మొదటగా డిసెంబర్ 12 న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైపూర్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ వేదిక ద్వారానే రాహుల్ గాంధీ ఈ పదాలను వాడుతూ, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇక ఈ సభ నుంచి రాహుల్ విరివిగా ఈ రెండు పదాలను వాడుతూ వస్తున్నారు. డిసెంబర్ 12 నుంచి 24 తేదీ వరకూ 112 సార్లు ఈ పదాలను ఉపయోగించారు. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. కేవలం రెంటి మధ్య వ్యత్యాసం చెప్పాలన్న తపనే తప్పించి, రాహుల్ వ్యాఖ్యల్లో ఇతరత్రా ఆంతర్యం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే డిసెంబర్ 12 నుంచి 18 వరకూ మూడు పెద్ద సభల్లో రాహుల్ ప్రసంగించారు. జైపూర్ వేదికగా జరిగిన సభలో రాహుల్ 57 సార్లు ఈ పదాలను ఉపయోగించగా, డిసెంబర్ 18 అమేథీ వేదికగా జరిగిన ర్యాలీలో 44 సార్లు ఈ పదాలను రాహుల్ ప్రయోగించారు. ఇక ట్విట్టర్ వేదికగా 8 సార్లు, పార్లమెంట్ వేదికగా బీజేపీని విమర్శించే సమయంలో ఒక సారి బీజేపీపై విరుచుకుపడ్డారని ఓ జాతీయ ఛానల్ పేర్కొంది.