కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ధూప్గురి (Dhupguri) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ (Nirmal Chandra Roy) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ (BJP) అభ్యర్థి తాపసి రాయ్ (Tapasi Roy) ని ఆయన ఓడించారు. దాంతో బీజేపీ సిట్టింగ్ స్థానమైన ధూప్గురి టీఎంసీ ఖాతాలో చేరిపోయింది.
ఈ గెలుపుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి స్పందించారు. ఇది చారిత్రక విజయమని అభివర్ణించారు. ఉత్తరబెంగాల్ పూర్తిగా టీఎంసీతోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సంపూర్ణ విజయం సాధించిందని, ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ స్థానమైన ధూప్గురి కూడా టీఎంసీ వశమైందని, ఆ నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని మమతాబెనర్జి అన్నారు.