ముంబై: జర్మనీలో ఏడాదిన్నరగా అనాథాశ్రమంలో పెరుగుతున్న తమ చిన్నారి అరిహ షాను తమకు అప్పగించాలని మహారాష్ట్రకు చెందిన ధర, భవేశ్ షా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. పాపను భారత్లో పెంచుకోవాలన్న తమ ఆకాంక్షను నెరవేర్చాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో భారత విదేశాంగ శాఖ శుక్రవారం జర్మనీ అధికారులతో చర్చించింది. చిన్నారి స్వదేశంలో పెరిగితేనే ఆమె సామాజిక-సాంస్కృతిక హక్కులు పరిరక్షించబడతాయని గుర్తు చేసింది.
అరిహ తల్లిదండ్రుల కథనం ప్రకారం చిన్నారికి జననేంద్రియాల్లో గాయమవగా ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ఈ విషయం జర్మనీ ప్రభుత్వం దృష్టికి వెళ్లగా తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పాపపై లైంగిక దాడి జరిగినట్టు కేసు నమోదు చేసింది. పాప పెంపకం హక్కులపై ప్రస్తుతం అక్కడి కోర్టులో కేసు నడుస్తున్నది. ఇరవై రోజులకు ఓసారి మాత్రమే పాపను కలిసేందుకు అనుమతి ఇస్తున్నట్టు వారు వాపోయారు. తమ వీసా గడువు మరో రెండు నెలల్లో ముగుస్తుందని, పునరుద్ధరణ జరగకపోతే, పాపను కలిసే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.