న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జారీ చేసిన సమన్ల మేరకు ఇవాళ మణిపూర్ డీజీపీ(Manipur DGP Rajiv Singh) విచారణకు హాజరయ్యారు. డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు వెళ్లారు. మణిపూర్లో జరుగుతున్న హింసపై జిల్లా స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాలతో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకు కేంద్రం వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ వేసిన ప్రశ్నలకు డీజీపీ రాజీవ్ సింగ్ సమాధానం ఇచ్చారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో ఒకవేళ 11 కన్నా ఎక్కువ సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు అయి ఉంటే, అప్పుడు జిల్లా స్థాయిలో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో విచారణ జరిపించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
మణిపూర్లో గత కొన్ని నెలల నుంచి రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వీడియో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇక పార్లమెంట్లోనూ మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
మణిపూర్ లో జరుగుతున్న సీబీఐ దర్యాప్తులను ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మాజీ జడ్జీలు జస్టిస్ షాలినీ జోషీ, జస్టిస్ ఆషా మీనన్ ఆ కమిటీలో ఉన్నారు.