న్యూఢిల్లీ, జనవరి 5: తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన మరువకముందే అలాంటిదే మరో ఉదంతం ఎయిర్ ఇండియాలో వెలుగు చూసింది. గత ఏడాది డిసెంబర్ 6న ఈ సంఘటన జరుగగా పదిరోజుల తర్వాత బయటకు వచ్చింది. ఈసారి కూడా ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నాడు. విమానంలోని తోటి ప్రయాణికురాలి దుప్పటిపై అతను మూత్రం పోశాడు. పారిస్-ఢిల్లీ విమానంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఆ వ్యక్తి ఆమెకు క్షమాపణ చెప్పాడని, దీంతో బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు
తోటి ప్రయాణికురాలిపై తాగుబోతు వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిరిండియాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, విమాన సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలియజేయాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్లో న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిరిండియా విమానంలోని ఎగ్జిక్యూటివ్ క్లాసులో మద్యం మత్తులో ఒక వ్యక్తి తోటి ప్రయాణికురాలైన 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీనిపై స్పందించిన డీజీసీఎ.. ఎయిరిండియాకు నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జరిగిన ఘటనపై ఎయిరిండియా గురువారం వివరణ ఇచ్చింది. తొలుత దీనిపై బాధితురాలు స్పందించినా అతనిపై ఫిర్యాదు ఇవ్వడానికి నిరాకరించినట్టు సంస్థ తెలిపింది. ఆమె అభ్యర్థన మేరకే తాము దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదని తెలిపింది.