న్యూఢిల్లీ, నవంబర్ 24: పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు తరుచూ జీపీఎస్ సంకేతాలను కోల్పోయి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయని తెలిపింది. ఈ ప్రాంతంలో విమానాల నేవిగేషన్ వ్యవస్థలు తరుచూ ఆగిపోతున్నాయని, ఇది తీవ్ర ప్రమాదాలకు దారితీయొచ్చని హెచ్చరించింది. ‘గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) నివేదికను బట్టి ఏవియేషన్ పరిశ్రమ కొత్త తరమైన జామింగ్, స్పూఫింగ్ ప్రమాదాలతో కొట్టుమిట్టాడుతున్నది. పశ్చిమ ఆసియా గగనతలంపై ప్రమాదకర జోక్యం ఇటీవల పెరుగుతున్నది’ అని పేర్కొన్నది. నేవిగేషన్ వ్యవస్థను జామ్ చేయకుండా చర్యలు చేపట్టాల్సి ఉన్నదని తెలిపింది. గత నెలలో పశ్చిమ ఆసియా గగనతలంలో చాలా పౌర విమానాలు ఎలాంటి జీపీఎస్ అనుసంధానం లేకుండా గుడ్డిగా ప్రయాణించాయని వెల్లడించింది.
స్పూఫ్ సిగ్నల్ ఎలా పనిచేస్తుంది?
విమానం గాల్లోకి లేచినది మొదలు.. మళ్లీ నేలపైకి దిగేవరకు దానికి ఎటు వెళ్లాలి? ఏ మార్గంలో వెళ్లాలి అనేది మార్గదర్శనం చేసేది జీపీఎస్ వ్యవస్థనే. ఈ వ్యవస్థ లేకపోతే చీకట్లో ప్రయాణించినట్టే.. ఇంతటి కీలక వ్యవస్థ పశ్చిమ ఆసియాలో కొన్నిసార్లు విఫలమవుతున్నది. ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్ గగనతలంలోకి విమానాలు ప్రవేశించగానే ఓ నకిలీ జీపీఎస్ సిగ్నల్ విమానాలకు అందుతున్నది. ఇది విమానంలోని జీపీఎస్ వ్యవస్థను ఏమారుస్తున్నది. వెళ్లాల్సిన మార్గాన్ని వదిలి వందల కిలోమీటర్ల దూరం వేరే మార్గంలో ప్రయాణిస్తున్నట్టు భ్రమింపజేస్తున్నది. ఆ సిగ్నల్ కూడా శక్తిమంతంగా ఉంటుండటంతో విమానంలోని జీపీఎస్ వ్యవస్థ గందరగోళంలో పడిపోతున్నది. అలా కొన్ని నిమిషాల్లోనే ఇనెర్షియల్ రిఫరెన్స్ సిస్టమ్ (ఐఆర్ఎస్) నియంత్రణ కోల్పోతున్నది. ఆ వెంటనే విమానం భూమిపై నుంచి తన నిజమైన జీపీఎస్ సిగ్నల్ కోల్పోతున్నది. దీనివల్ల విమానం చుక్కాని లేని నావలాగా ఆకాశంలో తన మార్గాన్ని వదిలి మరో దిశకు ప్రయాణిస్తున్నది. ఆ ప్రాంతాల్లో అంతర్యుద్ధ వాతావరణం ఉండటంతో భారీ ఆయుధ వ్యవస్థలు మోహరించినట్టు తెలుస్తున్నదని, వాటి నుంచే ఈ నకిలీ జీపీఎస్ సిగ్నళ్లు వస్తుండవచ్చని పేర్కొన్నది.