న్యూఢిల్లీ: దివ్యాంగ బాలుడ్ని విమానంలోకి నిరాకరించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఆ ఎయిర్లైన్స్ సిబ్బంది సందర్భానికి తగినట్లుగా వ్యవహరించడంలో విఫలమయ్యారని విమర్శించింది. పౌర విమానయాన నిబంధనల స్ఫూర్తికి విరుద్ధంగా వారి చర్య ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంబంధిత నియమ, నిబంధనల మేరకు ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్లు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఏవియేషన్ నిబంధనలను సవరిస్తామన్నారు.
కాగా, మే 7న చక్రాల కుర్చీకి పరిమితమైన దివ్యాంగ బాలుడితో కలిసి ఒక కుటుంబం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు ప్రయత్నించింది. అయితే దివ్యాంగ బాలుడిని విమానంలోకి ఆ సంస్థ సిబ్బంది నిరాకరించారు. తోటి ప్రయాణికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆ సంస్థ గ్రౌండ్ మేనేజర్ వినిపించుకోలేదు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇలాంటి వాటిని ఏ మాత్రం సహించబోమని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 9న హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థపై డీజీసీఏ చర్యలు చేపట్టింది. దివ్యాంగ బాలుడ్ని విమానంలోకి అనుమతించనందుకు రూ.5 లక్షల జరిమానా విధించింది.