అయోధ్య, జనవరి 23: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగగా, మంగళవారం నుంచి సామాన్య భక్తులకు రామయ్య దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే ఆలయం వద్దకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రధాన మార్గమైన ‘రామ్పథ్’ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. కొంత మంది భక్తులు పోలీసు లైన్లను కూడా దాటుకొంటూ వెళ్లారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపు 2.5 లక్షల మంది ఆలయానికి వచ్చారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పేర్కొన్నారు. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది రాములోరిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనావేశారు.
సోమవారం రాత్రి నుంచే పడిగాపులు
ప్రాణప్రతిష్ఠ జరిగిన సోమవారానికి ముందే భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకొన్నారు. వీరంతా నగరంలోని పలు చోట్ల విడిది చేశారు. రామ్లల్లా దర్శనం కోసం వీరంతా మంగళవారం ఉదయాన్నే ఒక్కసారిగా ఆలయం వద్దకు చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. కొంత మంది సోమవారం రాత్రి నుంచే మెయిట్ గేట్ బయట వేచిచూస్తున్నారు. ఆలయం ప్రవేశమార్గం రామ్పథ్ వద్ద భక్తులు ఇసుకేస్తే రాలనంతగా కనిపించారు.
జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. మధ్యాహ్నానికి ఈ సంఖ్య మరింత పెరుగడంతో.. భక్తులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది కష్టపడ్డారు. ప్రవేశ మార్గం వద్ద తోపులాటలో ఒక భక్తుడు స్పృహ తప్పి పడిపోయాడు. భక్తులు సజావుగా బాలరాముడిని దర్శించుకొనేందుకు క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకొంటున్నట్టు అధికారులు వెల్లడించారు. 8 వేల మందికి పైగా పోలీసులను మోహరించామని, పరిస్థితి నియంత్రణలో ఉన్నదని యూపీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ శిశిర్ తెలిపారు.
250 కోట్ల ఏండ్ల నాటి శిలతో బాలక్రామ్ విగ్రహం తయారీ
శతాబ్దాల ఎదురుచూపులు ఫలించి 500 ఏండ్ల తర్వాత అయోధ్యలో కొలువైన రామచంద్రుని చూసి కోట్లాది మంది భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన బాలరాముని విగ్రహంలో ఉట్టిపడుతున్న జీవకళ శిల్పకారుని చాతుర్యాన్ని చాటుతుండగా, ఆ ప్రతిమకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసిన శిల 250 కోట్ల ఏండ్ల నాటిదని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతిమ తయారీకి వినియోగించిన శిలపై భౌతిక-యాంత్రిక విశ్లేషణ చేయగా అది 250 కోట్ల ఏండ్ల క్రితం నాటిదని నిర్ధారణ అయినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ శిల చాలా పటిష్టమైనదని, ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుందని, కొద్దిపాటి నిర్వహణతోనే ఈ ఉష్ణమండలంలో వేల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని వెంకటేశ్ తెలిపారు.
భూమి ఏర్పడిన తర్వాత ఉడుకుతున్న లావా చల్లారినప్పుడు చాలా గ్రానైట్ రాళ్లు తయారవుతాయని, అలాంటి గ్రానైట్ చాల దృఢంగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణంలో సంప్రదాయ డిజైన్లతో తీర్చిదిద్దిన శిలలు చాలా నాణ్యమైనవని, వెయ్యేండ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని నిర్మించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
‘బాలక్ రామ్’గా అయోధ్య రామయ్య
అయోధ్యలో ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకొన్న బాలరాముడికి ‘బాలక్ రామ్’గా నామకరణం చేసినట్టు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలుపంచుకొన్న పూజారి అరుణ్ దీక్షిత్ మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో కొలువుదీరన రామచంద్రమూర్తి ఐదేండ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడని, అందుకే ఈ పేరును నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
ఆలయంలోనే మరో రెండు విగ్రహాలు..
కర్ణాటకలోని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ నల్లరాయితో రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఆలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. మరోవైపు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకొన్న మరో ఇద్దరు శిల్పులు చెక్కిన విగ్రహాలను కూడా ఆలయంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచనున్నట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఆ రెండు విగ్రహాల ఫొటోలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు బయటకు రాలేదు. వాటిల్లో రాజస్థాన్కు చెందిన శిల్పి సత్యనారాయణ్ పాండే తెల్ల మార్బుల్తో రూపొందించిన రామ్లల్లా విగ్రహం ఫొటో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ తెల్ల మార్బుల్ విగ్రహం ప్రస్తుతం ఆలయ ట్రస్టు వద్ద ఉన్నది. కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో బాలరాముడు అందులో దర్శనమిస్తున్నాడు. విగ్రహం వెనుక భాగంలో విష్ణు అవతారాలకు సంబంధించిన చిన్న శిల్పాలు ఉన్నాయి.