బెంగళూరు : దేశ ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని దేవేగౌడనే పెద్ద నాయకుడు అని జనతా దళ్(సెక్యూలర్) రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పేర్కొన్నారు. త్వరలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ అధికారంలోకి రాబోతుందని ఇబ్రహీం స్పష్టం చేశారు. కర్ణాటకలో మోదీ కంటే పెద్ద నాయకుడు దేవేగౌడనే అని తెలిపారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదు.. కర్ణాటక ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్కు మోదీ ఎలాగో.. కర్ణాటకకు దేవేగౌడ అలా అని చెప్పారు. దేవేగౌడ కర్ణాటక భూమి పుత్రుడు అని ఇబ్రహీం స్పష్టం చేశారు. ఈసారి తప్పకుండా జేడీఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యెడియూరప్పను కర్ణాటక ప్రజలు ఎన్నుకోలేదని, సీఎం అయ్యేందుకు ఆయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఇబ్రహీం పేర్కొన్నారు.
మంగళవారం రోజు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ప్రధాని దేవేగౌడ సమావేశమైన సంగతి తెలిసిందే. కర్ణాటకలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మోదీకి దేవేగౌడ మెమోరాండం సమర్పించారు. హసన్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాజెక్టుపై దృష్టి సారించాలని దేవేగౌడ మోదీని కోరారు. అంతర్ రాష్ట్ర నదులైన కావేరి, కృష్ణా, మహాదాయి నీటి కేటాయింపులను పరిశీలించాలని సూచించారు.
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య మరింత పెరిగింది.