న్యూఢిల్లీ: జడ్జీల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చల వివరాలను వెల్లడించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ వివరాలను బయటికి వెల్లడించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇద్దరు జడ్జీల నియామకం కోసం 2018 డిసెంబర్ 12న జరిగిన కొలీజియం సమావేశ వివరాలను వెల్లడించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘కొలీజియం అనేది బహుళ సభ్యుల సమాహారం. ఆ రోజు ఏం చర్చించుకొన్నా వాటిని బహిర్గతం చేయలేం. తీసుకొన్నది తాత్కాలిక నిర్ణయం. దాన్ని ప్రజల ముందు ఉంచలేం. ఆ సమావేశ తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తాం’ అని తెలిపారు. కొలీజియం సభ్యుల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా పిటిషనర్ పిటిషన్ దాఖలు చేశారని, మీడియా రిపోర్టులపై కోర్టు స్పందించదని వెల్లడించారు. తాము ఈ అంశంలో మరోసారి స్పందించదల్చుకోలేదని తేల్చి చెప్పింది. కాగా, ఆనాడు జరిగిన కొలీజియం సమావేశంలో రిటైర్డ్ సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ భేటీ వివరాలను సుప్రీం వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు.