Bengaluru | బెంగళూరు, మార్చి 14: నీళ్లు లేక కర్ణాటక అల్లాడుతున్నది.. ఒక్క బెంగళూరు నగరంలోనే 7 వేల బోర్లు ఎండిపోయాయి.. పాఠశాలల్లోనూ విద్యార్థులకు నీటిని అందించలేని దుస్థితి. అయినా.. అసలు బెంగళూరులో నీటి సమస్య లేదని అంటున్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ‘నగరంలో నీటి వనరులను గుర్తించాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమయానికి నీళ్లను అందిస్తున్నాం. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నది. బెంగళూరులో నీటి సంక్షోభమే లేదు. ఎవరికీ సమస్య రాకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు. డీకే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నెల రోజులుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే, సమస్య లేదనటంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వమే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తే, ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల వైపు ఎందుకు చూస్తున్నారని నిలదీస్తున్నాయి.
ఎన్నడూ లేనివిధంగా బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. నగరంలోని 60 శాతం మందికి పైగా నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. నీటి కోసం జనం ట్యాంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్కూళ్లలో విద్యార్థులకు తాగటానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరతతో పాఠశాలలను మూసివేస్తున్నారు.
కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు బెంగళూరు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. డిమాండ్ ఎక్కువ అవటంతో ప్రైవేట్ ట్యాంకర్ల ఓనర్లు ధరలను అమాంతం పెంచేశారు. ఇలాంటి సమయంలో నీటి సంక్షోభంపై కాంగ్రెస్ పాలిత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణం అవుతున్నాయి.