న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదుతో జార్ఖండ్లోని దియోఘడ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. ఈ మేరకు జీరో ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దేశ రాజధానిలోని నార్త్ ఎవెన్యూ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కాగా, జార్ఖండ్లోని దియోఘఢ్ ఎయిర్పోర్ట్లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఎయిర్పోర్ట్ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆగస్ట్ 31న ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాఠక్, దేవ్తా పాండే, పింటు తివారి ఎలాంటి అనుమతి లేకుండా దియోఘఢ్ ఎయిర్పోర్ట్లోని హైసెక్యూరిటీ ప్రాంతమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. తమ పలుకుబడిని ఉపయోగించి తమ చార్టర్డ్ విమానానికి క్లియరెన్స్ లభించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
కాగా, నూతనంగా ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో రాత్రి వేళల్లో విమానాల రాకపోకలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ ఎయిర్పోర్ట్లో సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకే విమాన సర్వీసులను అనుమతిస్తున్నారు. అయితే ఏటీసీ సిబ్బందిపై ఒత్తిడి వల్ల బీజేపీ నేతల చార్టర్డ్ విమానం రాత్రి 6.17 గంటలకు టేకాఫ్ అయింది. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసు నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దియోఘడ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుధ్ధం జరిగింది. నిబంధనల ఉల్లంఘనలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ ఎయిర్పోర్ట్లోని ఏటీసీకి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ను తీసుకోవడాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రశ్నించారు. దీనికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. సీఎం సోరేన్ ఆదేశాలను ఆ అధికారి పాటించారని ట్విట్టర్లో ఆరోపించారు.
కాగా, ఐఏఎస్ అధికారి మంజునాథ్ కూడా ట్విట్టర్లో బదులిచ్చారు. ‘గౌరవనీయమైన ఎంపీ సార్, నేను చట్టబద్ధమైన ప్రవేశ పాస్ తీసుకొని విమానాశ్రయ టెర్మినల్లోకి ప్రవేశించాను. దియోఘడ్ విమానాశ్రయం డైరెక్టర్ల బోర్డులో డిప్యూటీ కమిషనర్ కూడా ఒక సభ్యుడు’ అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలపై కేసు నేపథ్యంలో నిషికాంత్ దూబే ఫిర్యాదుతో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో తనపై దేశద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.