భోపాల్, జూలై 10: బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పేదోడికి ఆ సర్కారు దవాఖాన కనీసం ఓ అం బులెన్స్ను కూడా సమకూర్చలేకపోయింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నోడు తమ్ముడి శవంతో రోడ్డుపక్కన కూర్చున్నాడు. కన్నబిడ్డను సొంతూరుకు తరలించేందుకు ఆ తండ్రి అందరి కాళ్లూ పట్టుకుంటున్నాడు. ఈ హృదయవిదారక ఘటన.. డబుల్ ఇంజిన్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని గప్పాలు కొడుతున్న బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్నది.
అంబులెన్స్ ఉన్నా కూడా..
అంబాహ్ తాలుకాలోని బద్ఫ్రా గ్రామానికి చెందిన పూజారాంకు నలుగురు సంతానం. రక్తహీనతతో బారినపడ్డ రెండేండ్ల రాజాను స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్చాడు. జిల్లాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. పెద్దకొడుకు 8 ఏండ్ల గుల్షాన్ను వెంటపెట్టుకొని మొరేనా జిల్లా దవాఖానకు వెళ్లిన పూజారాం.. అక్కడే రాజాను చేర్చాడు. చికిత్స అందించినా ఫలితం లేక రాజా చనిపోయాడు. దీంతో అంబులెన్స్లో సొంతూరికి పంపాలని దవాఖాన సిబ్బందిని పూజారాం అర్థించాడు.
దవాఖాన ప్రాంగణంలో ఉన్న ఆంబులెన్స్ ఆపరేటర్ను కోరాడు, రూ.1,500 ఇస్తే అంబులెన్స్ పంపిస్తానని బదులిచ్చాడు. జేబులో చిల్లిగవ్వ కూడా లేదని, తాను డబ్బు ఇవ్వలేని పూజారాం.. బిడ్డ శవాన్ని పెద్ద కొడుకు చేతిలో పెట్టి.. సాయం కోసం ప్రతీఒక్కరి కాళ్లపై పడుతున్నాడు. అటువైపుగా వెళ్తున్న పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ దీనిపై దవాఖాన సిబ్బందితో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు స్వగ్రామానికి పంపించారు.