Pregnant Woman | జైపూర్ : పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణిని డాక్టర్లు పట్టించుకోలేదు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి గేటు వద్దే గర్భిణి బిడ్డను ప్రసవించింది. ఈ ఘటన రాజస్థాన్లోని కనవాతియా హాస్పిటల్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కనవాతియాకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండాయి. దీంతో బుధవారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కనవాతియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. అప్పటికే నొప్పులు అధికమవడంతో ఆమె ఆస్పత్రి గేటు వద్దే బిడ్డను ప్రసవించింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు కుసుం షైనీ, నేహా రాజవత్, మనోజ్ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు. ఇక కనవాతియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర సింగ్ తన్వార్కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.