బెంగళూరు: కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి డెంగ్యూను అదుపు చేయడంపై చర్చించారు. డెంగ్యూను సమర్థంగా కట్టడి చేయడం కోసం డిసీజ్ సర్వైలెన్స్ డ్యాష్ బోర్డును, మొబైల్ అప్లకేషన్ను ప్రారంభించారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా డెంగ్యూ నియంత్రణపై ఉన్నతాధికారులతో చర్చించారు. వ్యాధి మరింత విస్తరించకుండా తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వీధుల్లో మురికి నీటి గుంటలు లేకుండా, దోమలకు మరుగు లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు మురుగు నీటిని, చెత్తను క్లీన్ చేయించుకోవాలని సూచించారు.