న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వ్యాధి కలవర పెడుతున్నది. అక్కడ రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో జూలై 22 నాటికి ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 190కి చేరింది. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదు గత ఐదేళ్లలో ఇదే తొలిసారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చివరగా 2018లో ఢిల్లీలో 190కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు.
కాగా, డెంగ్యూ విస్త్రృతి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డెంగ్యూ వ్యాధి గురించి అన్ని ఏరియాల ప్రజలకు.. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో డెంగ్యూ చికిత్సకు కావాల్సిన అన్ని సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 190 యాక్టివ్ డెంగ్యూ కేసులు ఉన్నాయని, వాటిలో 65 కేసులు కేవలం జూలై మొదటి మూడు వారాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జూన్ నెలలో 40 మంది, మే నెలలో 23 మంది డెంగ్యూ బారినపడ్డారని చెప్పారు.