Joshimath | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో మంగళవారం ఇండ్ల కూల్చివేతను అధికారులు ప్రారంభించారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం కాని నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సందు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్లను నేలమట్టం చేస్తున్నారు.
జోషిమఠ్ కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 678 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. భూమి దిగబడటంతో జోషిమఠ్లో భవనాలు బీటలు వారుతున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేశారు.
ఇప్పటికు 4000వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎముకలు కొరికే చలికాలంలో జోషిమఠ్ వాసులు వారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి తాత్కాలిక ఆశ్రమాలకు వెళ్లారు. మరోవైపు పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.