Supreme Court | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్తో పాటు అతని సోదరుడి హత్యలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. ఈ కేసును ఈ నెల 28న జాబితా చేయాలని ఆదేశించింది. అదే సమయంలో 2017 నుంచి యూపీలో జరిగిన 183 ఎన్కౌంటర్లపై సైతం విచారణ జరపాలంటూ పిటిషనర్ కోరారు.
పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరిపించాలని న్యాయవాది విశాల్ తివారి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అయితే, ఐదుగురు న్యాయమూర్తులు అస్వస్థతకు గురికావడంతో వారు అందుబాటులో లేకపోవడంతో చాలా అంశాలు లిస్ట్ కాలేదని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని 28న లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. గ్యాంగ్స్టర్ అతీక్ అతని సోదరుడు అష్రఫ్ను ఈ నెల 15న రాత్రి పోలీసులు ప్రయాగ్రాజ్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా జర్నలిస్టుల పేరుతో వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.