Delhi’s Uttam Nagar : ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే యువకుడి హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో నిందితులపై కఠిన చర్యలకు దిగింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా నిందితుడి ఇంటిపైకి బుల్డోజింగ్కు దిగింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) అధికారులు ఉత్తమ్ నగర్లోని ప్రధాన నిందితుడి ఇంటిలోని అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ఇంటికి సంబంధించి అక్రమంగా నిర్మించిన కొన్ని నిర్మాణాలను బుల్డోజర్ ద్వారా ఆదివారం కూల్చివేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చర్య ద్వారా హత్య, హింసను సహించేది లేదని ప్రభుత్వం హెచ్చరించినట్లైంది. హోలీ నాడు చెలరేగిన ఘర్షణలో ఒక కుటుంబంపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తరుణ్ అనే 25 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో పాల్గొన్న నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు.
మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టైన వారిని ఉమర్దీన్ (49), జుమ్మాదీన్ (36), కమ్రుద్దీన్ (36), ముస్తాక్ (46), ముజాఫిర్ (25), తాహిర్ (18)తోపాటు ఒక మైనర్ ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా తరుణ్ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.