న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor Policy) కేసులో అరెస్టయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఇవాళ మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా కస్టడీని మరో 7 రోజులు పొడిగించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. వాదనలు విన్న కోర్టు సిసోడియా కస్టడీని ఐదు రోజులపాటు పొడిగించింది. అదేవిధంగా తన ఇంటి ఖర్చుల కోసం, తన భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం చెక్లపైన సంతకం చేసేందుకు అనుమతించాలన్న సిసోడియా అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందించింది. దాంతో సిసోడియా రూ.40 వేలు, రూ.45 వేల విలువ చేసే రెండు చెక్కులపై సంతకాలు చేశారు.
సిసోడియాకు సంబంధించిన ఈ మెయిల్స్ను, మొబైల్ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపామని ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిర్యాదు అందిన జూలై 22న సిసోడియా తన మొబైల్ ఫోన్ మార్చారని, ఆ ఫోన్తో సిసోడియా ఏం చేశారనేది తాము వెల్లడించలేమని పేర్కొంది. కాగా సిసోడియా న్యాయవాది వాదన వినిపిస్తూ.. సీబీఐ, ఈడీ చెప్పినవే చెబుతున్నాయని, కొత్త విషయాలేవీ లేవని అన్నారు. గత ఏడు రోజుల్లో సిసోడియాను 12 నుంచి 13 గంటలు మాత్రమే ప్రశ్నించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఈడీ మాత్రం ప్రతిరోజూ 5 నుంచి 6 గంటలు ప్రశ్నించామని, అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని తెలిపింది.