న్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాల వచ్చే నెల 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని ఢిల్లీ జూ డైరెక్టర్ రమేశ్ పాండే ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆగస్టు 1 నుంచి ఢిల్లీ జూను పునఃప్రారంభిస్తామని, అయితే ఎప్పటిలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాకుండా సందర్శకులను రోజూ రెండు షిఫ్టుల్లో అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
అయితే, ప్రవేశాలకు ఆఫ్లైన్ బుకింగ్ ఉండదని ఆయన వెల్లడించారు. కేవలం ఆన్లైన్ ద్వారానే ఎంట్రీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సందర్శకులు తూచా తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, కొవిడ్ నిబంధనల విషయంలో జూ అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారని ఆయన పేర్కొన్నారు. జూలో ప్రవేశానికి ఆన్లైన్ బుకింగ్లు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు.